Thursday, March 17, 2011

ఆయనకిద్దరు..... !! ఇంకో ఆయనకి..... ??


ఆయనకిద్దరు..... !!
ఇంకో ఆయనకి..... ??

అనగనగా ఒక రాజుగారు. ఆయనకిద్దరు భార్యలు. ఒకరు మంచి. ఒకరు చెడ్డ. (రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదే కదా).
 
 రాజు గారికి మంచి భార్య అంటే కొంచెం ప్రేమ ఎక్కువ. చెడ్డ భార్యకి మంచి భార్యను చూస్తే  కొంచెం  కోపం ఎక్కువ.

మం.భా ని చంపడానికి, రాజుగారికి ఆమెపై ద్వేషాన్ని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది చె.భా. కానీ ఎంచేతనో అవి ఫలించవు. ఇలా ఉండగా ఓ మంచి (? ) ముహూర్తాన మం.భా ఓ మంచి బిడ్డను కంటుంది. అది చె. భా. కి మరీ కంటగింపవుతుంది. అంతే. తన డబ్బూ, పలుకుబడీ ఉపయోగించి శకునిలాంటి సోదరుడి తోనో, మంధర లాంటి పనిమనిషి తోనో మంచి బిడ్డను కిడ్నాప్ చేయిస్తుంది. ఆ బిడ్డను చంపడానికి ఆమె చేయించిన ప్రయత్నాలు కూడా ( దైవానుగ్రహం మంచి పట్ల ఉండడం చేత కాబోలు) అవి వ్యర్థమైపోతాయి. అయితే చె.భా చేసే దుష్ట యత్నాలేవీ రాజు గారికి తెలీవు. చివరాఖరికి తెలిసాక చె.భా ని రాజు శిక్షించాలనుకుంటాడు కానీ మ.భా విశాల హృదయంతో చె.భా కి క్షమా భిక్ష పెడుతుంది. ఇక అంతా శుభమే. కథ కంచికీ...మనమింటికీ (మింటికీ మంటికీ ఏకధారగా).............

అబ్బబ్బబ్బ....విసుగైత్తిపోతోంది. చిన్నప్పట్నించీ వింటున్నాం...కంటున్నాం - జానపదకథలు...ఇంకా ఎన్ని సార్లు వింటాం??  ఎన్నిసార్లు  కంటాం??
అయినా ఈ కలభాషిణి సీరియస్ గా సీరియల్ కథలు చెప్తోంది కదా - ఈ మధ్య ! అవి మానేసి జానపదం మొదలెట్టిందేం? తేరగా, తీరిగ్గా దొరికామనా...అనుకుంటున్నారా – నా బ్లాగు బాధితులూ....!!

సారీ అండీ...

నేనింతవరకూ చెప్పింది జానపదం కాదండీ. అచ్చ తెలుగు(?)టీవీ సీరియల్ కథ.

కాస్త కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసి (ఆగండాగండి.... మీరు కాదు...) షర్టూ ప్యాంటూ చీరలూ చోళీలూ తగిలించి సెల్లూ గిల్లూ మోతలతో ఆ జానపద పాత్రలని అలంకరించుకోండి అత్యాధునికంగా. ఇట్టే తెలుగు సీరియల్ పాత్రలు కళ్ళకు కట్టేస్తాయి.

అయితే తమరింతవరకు చెప్పింది సీరియల్ కథా....?

కానీ ఈ 21 వ శతాబ్దంలో కూడా- ఆయనకి ఇద్దరేమిటీ?  అదీ.. ఒకే ఇంట్లో కలిసి ఉండడ మేమిటీ ? ఈ కత్తులూ, కఠార్లూ నూరుకోవడమేమిటీ ? జనాలివి చూస్తూ ఊరుకోవడమేమిటీ...?

చిరకాలం సాగిన ఈ రాచరికాలూ, అన్యాయాలూ, అబలలపై దాడులూ ఇంకనా... ఇకపై చెల్లవు అంటూ శ్రీ శ్రీ ఆవహించి పళ్ళు నూరుతున్నారా...
ఒద్దు సుమండీ.......పళ్ళు నూరితే అరిగి పళ్ళపొడిగా మారే ప్రమాదముంది.( అసలే అసలు సిసలు రూపాలకి నకిలీ పళ్ళపేస్టులు దొరుకుతున్న రోజులివి)
హు...ఒకరు బతికుండగానే, కనీసం విడాకులైనా లేకుండానే మరొకర్ని చేసుకోవడమా...ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడమా... దీనికి ఇంటిల్లిపాదీ (ప్రేక్షకులతో సహా) ఆమోద ముద్ర వేయడమా?

 అసలు చట్టం అనేది ఉందా? ఉంటే ఏం చేస్తోందసలు? అంటూ ఎడం అరచేతిలో పిడికిలి బిగించి కొట్టుకుంటూ ఆవేశ పడుతున్నారా...
అబ్బే.... ఎంత మాత్రమూ లాభం లేదండీ.

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ...అనే  సినిమా పాటతోనో-
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే నేటి రాజకీయనాయకుల మాటతోనో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవలసిందే. సుబ్బరంగా సూటూ బూటూ వేసుకు తిరుగుతున్న వాళ్ళక్కూడా షుగర్ వ్యాధులొచ్చే చెడ్డ రోజులివి సుమండీ.

నేటి సీరియల్ కథల్లో చాలా వరకు (ముప్పాతిక మువ్వీసం) చట్టాల పరిథిలోగాని, సాంఘిక విలువల చట్రాల పరిథి లోకి గాని ఒదగవు. వాటికంటూ ప్రత్యేక చట్టాల్ని, విలువల్ని, సృష్టించుకొని అటానమస్ గా వెలిగిపోతున్న సీరియల్ రాజాలవి.

టాప్ రేటింగ్ సీరియల్ దగ్గరనుంచి అతి సాధారణ సీరియల్ వరకూ ఇంచుమించు అన్నిటిలోనూ ఇదే పోకడ. 

ఒకరికి ఇద్దరైన వేడుకేలే......!! అని పల్లెటూరు బావలా పాడుకుంటూ (మనకి ఆ పాట రాకపోతే వాళ్ళే పాడేస్తారు లెండి) సరి పెట్టేసుకోమంటారు,  సీరియల్ నిర్మాతాదులు.

ఈ కిడ్నాపులూ, చంపుకోవడాలూ, ఇద్దరు భార్యల భాగోతాలు ఇలాంటివి మన సమాజంలో క్వాచిత్కంగా తప్ప చూడమే. అలాంటిది ఈ కంపు ప్రతి ఇంట్లోను కామనే అన్నట్టుగా చూపిస్తూ ఉంటే అఖిలాంధ్ర స్త్రీ ప్రేక్షకులు ఎలా సమర్థిస్తున్నారసలు.... బామ్మల దగ్గరనుంచి  భామల  వరకూ ఎలా ఆదరిస్తున్నారు ?  ఈ ఘోర కలిని ఎలా సహిస్తున్నారు…. ? ఎలా భరిస్తున్నారు.....? హు...హు...!!

అదిగో - మళ్ళీ ఆవేశ పడుతున్నారు చూసారా... ….వద్దే వద్దు సుమండీ...!!
ఆవేశం బీపీ దాయకం. అసలే ఇరవైకే అరవైలోలా బీపీ లొచ్చే కలికాలపు రోజులివి.

మరి ఇలా వింటుంటేనే బీపీలు తెప్పించే ఈ సీరియల్ కథలు ఇంతమంది ఆదరణకి ఎలా నోచుకుంటున్నాయి?

ఎలా ఆకర్షించగలుగుతున్నాయి ?

భారతం, భాగవతంలోని శృంగార కథలు గారెలు తిన్నట్టుగా ఉంటాయని జాషువా (ముసాఫర్లు లో) వర్ణిస్తాడు. ఈ కథలు అఖిలాంధ్ర  స్త్రీలోకానికి  గారెలు తిన్నట్టుగా  అతిమధురంగా ఎలా తోస్తున్నాయి!   ఒక్కరోజు ఎపిసోడ్ మిస్సయితే  ఒక వాయి గారెలు మిస్సయినంత బాధ  ఎందుకు కలుగుతోంది?

బాగా ఆలోచించిన మీదట నాకు తోచిన కారణం ఒకటే.
రామాయణం విని ఏక పత్నీ వ్రతుడైన రాముణ్ణి పూజించాం.
భాగవతం విని బహు పత్నీవ్రతుడైన కృష్ణుణ్ణి  ఆరాధించాం.
ఆ ఇద్దర్నీ మహా పురుషులుగా, ఆ యుగపు ధర్మాన్ని అనుసరించిన వారిగా వారిని సమర్థించాం.

సరిగ్గా ఇప్పుడూ అదే  విశాల నేత్రాలతో తిలకిస్తూ, విశాల హృదయాలతో,  ఈ సీరియల్ పాత్రలను ఆదరిస్తున్నాం. 

కానీ అవి గత కాలపు కథలు. అప్పటి యుగధర్మాల గురించి విన్నవారమే కాని కన్నవారము కాము కాబట్టి ఆ కథలను సమర్థించవచ్చునేమో.
కానీ ఈ సీరియల్లో కథలు నేటి కథలు. మన చుట్టూ ఉన్న మనుషుల గురించి అల్లిన కథలు. ఈ యుగపు ధర్మాలూ, చట్టాలూ అన్నీ మనం కన్న వారం మాత్రమే కాదు. అనుసరిస్తున్నవారం.

మరి అలాటిది ఈ యుగ సాంఘిక ధర్మానికీ, చట్టానికీ విరుద్ధంగా నడుస్తున్న  ఈ కథలను తప్పనుకోకుండా తప్పనిసరిగా చూసి ఆరాధించడం తప్పో ఒప్పో... !!
 మరి ఆ తప్పొప్పులను నిర్ణయించే భగవంతుడే చెప్పాలి.
మానవుడు సంఘజీవి.సంఘంలో జీవించలేని వాడు పశువైనా కావాలి. లేదా పరమాత్ముడైనా కావాలి అంటాడు అరిస్టాటిల్.

ఈ మాటలను సీరియల్ పాత్రలకు అన్వయిస్తే వారు ఏ కేటగిరీ కిందకు వస్తారో ప్రేక్షక విజ్ఞులే నిర్ణయించాలి.

మరి మీరేమంటారు బ్లాగర్జీ...... ?

అఖిలాంధ్ర  సీరియల్ ప్రేక్షకులూ..

Tuesday, March 8, 2011

నాణానికి అటూ - ఇటూ




ప్రకృతివి నీవు

పురుషాహంకార సమాజానికి నిలువెత్తు ఆకృతివి నీవు

వెలిగే చుక్కవు నీవు
స్వేచ్ఛ అనే రెక్కలు తెగిన పక్షివి నీవు

సృష్టికి మూలం నీవు        
నీ అస్తిత్వాన్ని చాటితే గర్భంలోనే లయించే పిండం నీవు

ఆకాశంలో సగం నీవు
శూన్యంలో సగాన్ని పొంది శూన్యంగానే మిగిలిపోయే జీవివి నీవు

మమతలు పంచే అమ్మవు నీవు
అంగట్లో అమ్ముడు పోయే అందాల బొమ్మవు నీవు

తరాల నడుమ వారధి నీవు
తరతరాలుగా కన్నీళ్ళు కార్చినా ఎండిపోని అంబుధి నీవు.

Tuesday, March 1, 2011

పేగు కాలిన వాసన( ఎ.ఎన్.జగన్నాథ శర్మ) కథా సంపుటి - పరిచయం



గత అయిదుసంవత్సరాలుగా ప్రతిఏటా ఒక ఉత్తమ కథల సంపుటికి మాడభూషి రంగాచార్య ట్రస్టు, రచయితకి 5000 రూ. నగదు బహుమతి,మెమెంటోతో  పురస్కారం అందచేస్తోంది. 2011సంవత్సారానికి గాను మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం -శ్రీ  ఎ.ఎన్.జగన్నాథశర్మ గారి పేగుకాలిన వాసన కథా సంపుటికి లభించింది. ఫిబ్రవరి 25,2011 న జరిగిన సభలో శ్రీ శర్మగారు ఈ పురస్కారం అందుకున్నారు.



కథా సంపుటి రచన  ఎ.ఎన్. జగన్నాథ శర్మ
ప్రతులకు:
పాలపిట్ట ప్రచురణలు 
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట,
హైదరాబాద్- 500 036
వెల       125.


 పేగుకాలిన వాసన కథా సంపుటి - పరిచయం

కొన్ని కథలు ఆహ్లాదాన్నిస్తాయి. కొన్ని కథలు ఆవేశాన్ని రగిలిస్తాయి. మరికొన్ని కథలు తీరని మన కలలకీ, ఆశలకీ రెక్కలు తొడిగి ఊహాలోకంలో విహరింప చేస్తాయి. అతి తక్కువ కథలు మాత్రమే మన కళ్ళకు వాస్తవికత అనే కళ్ళజోడు తొడిగి, అంతవరకు మనం చూడని, చూడలేని జీవితపు మూలల్ని(మూలాల్ని) స్పష్టాతి స్పష్టంగా చూపుతాయి. ఆలోచింపచేస్తాయి. అటువంటి కథలకు సాహితీ లోకంలో ఎప్పటికీ శాశ్వతత్వం ఉంటుంది.

 ఎ.ఎన్. జగన్నాథ శర్మ  పేగు కాలిన వాసన కథలు ఈ కోవకు చెందినవి. దిగువ మధ్య తరగతి జీవితాల్లోని వివిధ కోణాలను చిత్రించిన ఈ కథలను చదివినప్పుడు మనం నివసిస్తున్న సమాజం పై కసీ, ఛిద్రమైన జీవితాల పట్ల జాలీ, వారి కోసం ఏదో చెయ్యాలనే తాపత్రయం, ఏదీ చెయ్యలేని నిస్సహాయతా కలగలిసిపోయి ఒకానొక అచేతన స్థితికి చేరుకుంటుంది మనసు. ఈ కథలను  చదువుతున్నప్పుడు మనం ఏ అనుభూతిని పొందుతామో సరిగ్గా అదే అనుభూతితో రచయిత రాసిన కథలివి. అందుకే ఈ కథలను చదువుతున్నప్పుడు మనం పీల్చేది పేగు కాలిన వాసన ని మాత్రమే కాదు. ఛిద్ర జీవితాలకోసం అలమటించే రచయిత గుండె కాలిన వాసన కూడా.

దిగువ మధ్య తరగతి జీవితాల్లోని విషాదాన్ని, వేదనను, దారిద్ర్యాన్ని, బలవంతుల దౌర్జన్యాలనీ, పరపీడన పరాయణత్వాన్ని, పిడికెడు అన్నం కోసం దిగజార్చుకుంటున్న విలువల్నీ రచయిత కరుణ రసాత్మకంగా చిత్రించారు. ఈ కథలన్నీ వాస్తవ జీవితాన్ని చిత్రించినవే అయినా ఆ వాస్తవ జీవితాల్లోని వ్యథార్త జీవిత యాథార్థ దృశ్యాలన్నీ మనల్ని భయపెడతాయి. వెంటాడి వేధిస్తాయి. వేదన రగిలిస్తాయి. ఆలోచించడం తప్ప మరేమీ చేయలేని మన చేతకానితనాన్ని, శూన్య హస్తాలనీ వెక్కిరిస్తూనే ముందుకు తీసుకుపోతాయి. మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి.

ఈ సంపుటి లోని చాలా కథలు మధ్య తరగతి జీవితాలకు అద్దం పట్టిన కొడవటిగంటి కుంటుంబరావు, కాళీ పట్నం రామారావు, తిలక్ వంటి రచయితలను గుర్తు చేస్తాయి. అంత మాత్రాన ఈ కథలు వాటికి అనుకరణలూ, అనుసరణలూ కావు. ఈ సారూప్యతకి కారణం వీరందరి కథా భూమిక ఒకటే కావడం. వీరందరూ మధ్యతరగతి జీవితాలు అనే నేలపై వాస్తవికత అనే విత్తనాలు నాటి కథల పంటలు  పండించిన రచయితలు. నేల ఒకటే అయినా పండే పంటలు భిన్నమే కదా. వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే రుచీ భిన్నమైనదే. అలాగే ఈ రచయితల ఇతివృత్తమూ, కథన శైలీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ ఏదో అంతస్సూత్రం మాత్రం వీటిని ఒకే చోట బంధించేలా చేస్తుంది.

పేగుకాలిన వాసన సంపుటి లోని చాలా కథల్లో మధ్య తరగతి జీవితాలను, కోరికలను చిన్నా భిన్నం చేసే ఆకలీ, దానికి మూలమైన దారిద్ర్యం భిన్న రూపాల్లో విలయతాండవం చేస్తుంది. మధ్యతరగతి మనుషులు ఏ విలువలనైతే నమ్ముకుని, ఊపిరనుకుని బతుకుతారో చివరికి ఆ విలువలనే జానెడు పొట్టకోసం అమ్ముకునే, లేదా చేజార్చుకునే పరిస్థితిని నిప్పుబొమ్మ, తెగిపడిన పావురం రెక్కలు అనే కథలు నిరూపిస్తాయి. నిప్పుబొమ్మ  లోని ఆమె (పేరులేదు) మరిదికి అమ్ముడు పోవడాన్ని కొంతవరకైనా సమర్థించగలమేమో కాని తెగిపడిన పావురం రెక్క లో కొన్ని అవసరాలకు భార్యనే పావుగా వాడుకునే శంకరాన్ని సమర్థించలేం. రచయిత కూడా సమర్థించలేదు. అనేక రకాలుగా అనేకులు బతుకుతుంటారు. వారిలో శంకరం ఒకడు. అంతే అని వ్యాఖ్యానించి శంకరం వంటి వ్యక్తులుంటారని తెలియజేస్తారు. ఈ కథలో వనజాక్షి పాత్రమీద కూడా మనకి ప్రత్యేకమైన సానుభూతి కలగదు. ఇంటరు వరకూ చదువుకున్న అమ్మాయి ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు కదా. భర్తకు లొంగవలసిన అవసరం ఏమిటి అన్పించక మానదు. అయితే రచయిత  శంకరం పాత్ర గురించి చెప్పిన మాటలు ఈమెకి కూడా అన్వయించుకుంటే సరిపోతుంది.

మధ్యతరగతి చావు, చేతులు తెగిన హృదయం, శవం వంటి కథలు మరణాన్ని, మానవత్వపు విలువల్నీ కూడా శాసిస్తూ తన చుట్టూ తిప్పుకోగలిగే ధనరాకాసిని నిలువెత్తునా చూపించి భయపెడతాయి.

గాంధీ, గాజు పెంకులు కథలు చికితిపోయిన నాటక రంగాన్నీ, రంగస్థల నటుల జీవితాల్నీ అద్దం పడతాయి. గాంధీలో నాయకుడికి పేరు లేదు. వేషాలు వేయడం ఇతని కులవృత్తి. పొట్టకూటి కోసం
గాంధీ వేషం కట్టినా నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవడం లేదు. పైగా జాతీయ నాయకుడి వేషం కట్టినందుకు  నాల్రోజులు జైలుకూడు తినవలసి వచ్చింది కూడానూ. కళలకి మూల విరాట్ అయిన శివుడి లాగే జీవనగరళాన్ని గొంతులోనే నిలుపుకొని , శ్మశానం లోనే నివసిస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలుగొందిన నాటకరంగం వెండితెర వెలుగుల్లో ఎలా వెల వెల పోయిందో , ఆ రంగాన్ని నమ్ముకున్న కళాకారుల జీవితాల్లో కళ ఎలా తప్పిపోయిందో  నాయకుడి పాత్ర ద్వారా రచయిత తెలియజేస్తారు ఈ కథలో ఆఖరి వాక్యాలు కథకి ముగింపు కావచ్చునేమో కానీ పాఠకుల బుద్ధి వికసనకు అవే బీజం వేస్తాయి.

రేపటినుండి గాంధీ వేషం కట్టను. నా మనవరాలు పెద్దమనిషయింది. ఈ మూడు మూర్ల గావంచా గుడ్డ దానికి ఇచ్చేసి నేను గోచీ కట్టుకొని మరో వేషం వేస్తాను.....వేమన వేషం.

రంగస్థల కళాకారుల జీవితాల్లోని చీకటి కోణాన్ని అత్యద్భుతంగా చిత్రించిన వాక్యాలివి. ఆర్థికంగా చితికిపోయి ఆసరా కోసం ఆశగా ఎదురుచూసే కళాకారులకు సన్మానాలు చేసి శాలువలూ, కప్పులూ ఇచ్చే బదులు బతకడానికి తోవచూపించి ఆదుకోవడం ఉత్తమమనే సందేశాన్నిస్తుంది గాజుపెంకులు కథ.

చుక్కెదురు, మళ్ళీ ఖాళీ ఆకాశం, అన్నదాతా సుఖీభవ కథలలో కూడా ఆకలీ, దారిద్ర్యమూ  పెద్ద పీట వేసుక్కూర్చుంటాయ్. వివిధ వృత్తులను నమ్ముకున్నా పొట్ట గడవని చితికిన బ్రతుకులు అవన్నీ. సహస్ర వృత్తుల సహస్ర చిహ్నాల్ అని శ్రీశ్రీ చెప్పినట్టుగా శ్రమ శక్తికే  కాకుండా ఆకలీ, దారిద్ర్యానికి చిహ్నాలుగా మారడం ఖేదదాయకం.

పై కథలకు భిన్నంగా మార్నింగ్ గ్లోరీ, పయనించే ఓ చిలుకా, గుండె తోటలో నీలి గోరింట, ఓనమాలు, నొసటి సూరీడు నాన్నంటే, గూడు బండిలో నాన్న, ఉద్ధరిణి మొదలైనవి వేటికవే ప్రత్యేకమైన ఇతి వృత్తంతోనూ, కథల శైలి తోనూ రూపుదిద్దుకొని పాఠకుల గుండె తోటలో నీలి గోరింటలు పూయిస్తాయి.
ఈ కథా సంపుటికంతటికీ తల మానికమైన కథ పేగు కాలిన వాసన. ఈ కథను రచయిత ఉత్తమ పురుషలో చెప్పారు. వర్షం నాటి రాత్రి జట్కాబండిలో మనని కూచో పెట్టి రచయితే జట్కావాలాగా మారి అలవోకగా కథను ముందుకు నడిపిస్తారు. జట్కాబండి అంత వడిగాను, లయబద్ధంగానూ సాగిపోతుందీ కథ.

పసితనం నుండీ దరిద్రంతో సహవాసం చేసిన ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలనే కోరికతో కుటుంబ బంధాలను తెంపుకుని దూరంగా పారిపోయి జట్కా తోలుకుంటూ ఒంటరిగా బ్రతుకుతుంటాడు. ఒక వర్షం కురిసిన రాత్రి అతని జట్కాలో బొటన వేలు లేని తన తండ్రి లాంటి వ్యక్తి  ఎక్కినపుడు అతని మనసులో రేగిన ఆలోచనలే ఈ కథకు రూపం ఇచ్చాయి.  ఒక్కసారిగా అతనికి గతమంతా కదలినట్టవుతుంది. ఏదో ఒక అవసరం కోసం తండ్రి తన వేళ్ళను యంత్రానికి బలి ఇవ్వడం, అమ్మ అనారోగ్యం, అక్క ఆప్యాయతా, తన బాల్యం అన్నీ కళ్ళముందు మెదలడంతో  వారిని ఎలా అయినా చూడాలనే  కోరిక  బలంగా వేళ్ళూను కుంటుంది. దరిద్రాన్ని అసహ్యించుకునో లేక భయపడో పారిపోయిన అతను ఈ పదేళ్ళనూ సాధించినదేమీ లేదు. మరికొంత దరిద్రాన్ని తప్ప.
నా అన్న వారిని చేజేతులా దూరం చేసుకొని దారిద్ర్య సాగరాన్ని ఒంటరిగా ఈదలేక ఉక్కిరి బిక్కిరి అవడం తప్ప . అందుకే చివరికి అనుకుంటాడతను

దేనికి దూరంగా పారిపోదలచానో అది నాకు సాధ్యం కాలేదు. ఎల్లెడలా ఒకే దృశ్యం ఒకే జీవితం. రాకాసి లోయ అంతటా వ్యాపించి ఉంది. క్రూర మృగాలు, మారణాయుధాలు, మంత్ర తంత్రాలు నాలాంటి కుటుంబీకుల కోసమే పొంచి ఉన్నాయనిపించింది. నా వాళ్ళను నేను రక్షించుకోవాలి. అందుకు సన్నధ్ధం కావాలి.
ఆకలీ దరిద్రం ఎక్కడ లేవు. దరిద్రాన్ని చూసి భయపడడం కన్నా దరిద్రం మరోకటి లేదు. జీవితాన్ని ధైర్యంగా  ఎదుర్కోవాలి గానీ బంధాలను తెంచుకుని పారి పోవడం అనుచితం.... అనే గొప్ప స్ఫూర్తిని ఈ కథ అందిస్తుంది. అద్భుతమైన కథన శైలీ, నిర్మాణ శిల్పమూ ఉన్న విలువైన కథ యిది.

సుమారు 500 కథలు రాసి లబ్ధ ప్రతిష్ఠులయిన ఎ.ఎన్. జగన్నాథ శర్మ గారి కథానిర్మాణ శైలి గురించి గానీ, పదప్రయోగం, వాక్య విన్యాసం వంటి విషయాలను గురించి చెప్పడం సూర్యుడి ముందు దివిటీ పట్టడం లాంటిది. ఉత్తరాంధ్ర గర్వించ దగ్గ అతికొద్ది గొప్ప కథకుల్లో వారు ఒకరు. ఉత్తరాంధ్ర మాండలికపు నాడిని అతి వాడిగా పట్టుకోగలిగిన రచయితగా ఈ సంపుటిలోని శవం కథ ద్వారా మరోసారి నిరూపించుకోగలిగేరు. జాబిల్లి నుండి వెన్నెల జాలువారినంత అలవోకగా కథక చంద్రుడి కలం నుండి కథా చంద్రికలు జాలువారతాయి. వెన్నెల్లో ఉండే స్వచ్ఛతా, సారళ్యమూ, సౌందర్యమూ వీరి కథల్లో నిబిడీ కృతమై ఉంటాయి. కానీ ఈ వెన్నెల మనసుకి మత్తెక్కించి జోలపాడి నిద్రపుచ్చే వెన్నెల కాదు. నిద్రాణమై ఉన్న  జగతిని జాగృత పరిచే వెన్నెల. జీవితపు  చీకటి కోణాలను కూడా దర్శించి ఆ చీకట్లను తొలగించడానికి ప్రయత్నించే పదునైన వెన్నెల. గుండెలను చీల్చే కత్తి వాదర లాంటి 
వెన్నెల.
ఈ కథా చంద్రికలను సాహితీ ప్రియులందరూ ఆస్వాదించి తీరవలసిందే. మంచి మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరవలసిందే.
Related Posts with Thumbnails