Sunday, August 1, 2010

కవితామృతాన్ని కురిపించిన తిలక్




వెన్నెల్లో అందమైన ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటే
కొబ్బరాకుల మధ్యనుండి పున్నమి చంద్రుడు అమృతం కురిపిస్తూ ఉంటే
నిశ్శబ్దంగా ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వలో రాలి పడితే
ప్రియురాలి కాలి మువ్వ మధురంగా సందడి చేస్తే
జూకామల్లె పరిమళంతో పిల్ల తెమ్మెర మృదువుగా ఒళ్ళు నిమిరితే

 అది తిలక్ కవిత్వం అవుతుంది. ఆ కవిత్వపు లోతులు చవిచూసిన వారికే అతని సుకుమార హృదయం ఆవిష్కృతమవుతుంది. ఆ సున్నిత హృదయంలోని ఆర్తి, కరుణరసాభివ్యక్తి పాఠకులకు నిత్య వసంతానుభూతి కలిగిస్తుంది. వారి మనసులను కరుణరసకాసారాలుగా మారుస్తుంది.

వంతెన కింద పిల్లాణ్ణి ప్రసవించి మూర్ఛిల్లిన స్త్రీ మూర్తిని చిత్రించినా, చిన్నసైజు జీతగాడైన తపాలా బంట్రోతును కళ్ళముందు సాక్షాత్కరింపజేసినా, ఆర్ద్రత నిండిన మనసుసుకవి తిలక్ ఒకడే అలా మనఃఫలకం మీద అద్దగలడు. కన్నీరుగా కరిగిన గీతికగా మార్చగలడు. కఠిన శిలనైనా కన్నీటి జడులతో తడిసిన దయా పారావతాలుగా మలచగలడు. అతని కవిత్వం అనితర సాధ్యం. అతను మూర్తీభవించిన మానవత్వం.

కుందుర్తి వారు చెప్పినట్లుగా వాల్మీకి నుండి నేటివరకూ కవులందరూ  కరుణరస వాదులే. కరుణ రసావేశం తో కవిత్వం రాసినవారే. పక్షుల శోకం వాల్మీకి నోట శ్లోకంగా పలికి రామాయణమైంది. పీడిత వర్గాల శోకం చూసి చలించిన ఆధునిక కవిలోని ఆర్ద్రత అభ్యుదయ కవితగా ఆవిష్కరింపబడింది. ఆభ్యుదయ కవికి పేదవర్గాల పట్ల ఎంత సానుభూతి ఉందో వారి పేదరికానికి కారకులైన ధనిక వర్గాల పట్ల, సమాజం పట్ల అంతకు రెట్టింపు కోపం ఉంది. దోపిడీ వ్యవస్థ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్యడానికి భయంకరమైన కొత్త పదబంధాలు సృష్టిస్తూ పరుష పదజాలంతో నిందిస్తాడు అభ్యుదయ కవి. భావ, అభ్యుదయకవులకి వారధిగా నిలిచిన తిలక్ కి కూడా బడుగు వర్గాల పట్ల సానుభూతి ఉంది. కానీ వారిని దోచుకుంటున్న వారిపై ద్వేషం లేదు, కసి లేదు.ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలన్న తపన మాత్రమే ఉంది. బడుగు వర్గాలను ఆదుకోవడానికి ఏ దేవుడైనా దిగివస్తే బావుండునన్న ఆవేదనా, దిగిరమ్మన్న నివేదనా అతని రచనలో కనిపిస్తుంది. వీరందరి కవితా భూమిక ఒకటే. అభివ్యక్తి లోనే భిన్నత.

బడుగు జీవుల కష్టాలను శ్రీశ్రీ చిత్రిస్తే పాఠకుల కళ్ళనుండి కలకలా కన్నీళ్ళు రాలవు. ఒంట్లోని రక్తం సల సలా మరుగుతుంది. రక్త జ్వాలలూ, కలకత్తా కాళిక నాలుకలూ కళ్ళముందు ఆవిష్కృతమవుతాయి. పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ కదం తొక్కుతూ పదం పాడుతూ తాము కూడా విప్లవ సైనికులుగా మారిపోవాలనే ఆవేశం కలుగుతుంది. అదే బడుగువర్గం గురించి తిలక్ రాస్తే జాలిజాలిగా కన్నీరు చెక్కిళ్ళనుండి జాలువారుతుంది. ఆ కరుణ రసానుభూతిలో గుండె బరువెక్కుతుంది. శ్రీశ్రీ – తిలక్ వీరిద్దరి కవితా భూమిక ఒకటే కానీ వ్యక్తులు వేరు. వారి అభివ్యక్తులు వేరు. అందుకే శ్రీ శ్రీ అభ్యుదయ కవి అయాడు. తిలక్ భావకవికీ, అభ్యుదయ కవికీ వారధిగా నిలిచాడు. మానవతా వాది, అనుభూతివాది అయాడు.

ఆర్తి లేదా ఆర్ద్రత అన్న పదాన్ని నిర్వచించడం చాలా కష్టం. అది ఒక అనుభవం. బాధ అనే సామాన్యార్థం చెప్పుకున్నా దాని స్థాయి వేరు, తీవ్రతా వేరు. అది భాషలో పొదగలేని భావం. మరి ఇలాంటి, భాషకందని భావాన్ని భాషలో ఒదిగించి రాయగలగడమే తిలక్ విశిష్టత. తిలక్ ఆర్తగీతాన్ని చదివినప్పుడు మాత్రమే ఆర్తి అనే పదానికి గల అసలు అర్థాన్ని అనుభవంతో గ్రహించగలం.

అభ్యుదయకవి దేవుడి పేరిట సమాజంలో జరుగుతున్న మోసాలను, దోపిడీని, మూఢవిశ్వాసాలను, పేదవారి హీనస్థితికి కారణమైన పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థమీద ఆగ్రహంతో దుమ్మెత్తిపోస్తాడు. కానీ తిలక్ పేదవారి హీనస్థితి చూసి దానికి కారణమైన దోపిడీ వ్యవస్థను నిందించడు. కన్నీరుగా కరిగిపోతాడు. అంతరాంతరాలలోనే దగ్ధమైన బూడిద అవుతాడు. ‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ భగవంతుడికి నివేదించగలదు’(ఆర్తగీతం) అంటూ పరితపిస్తాడు. సమాజానికి పేదవాడిని చూపించి వాడిమీద జాలి కలిగించి చేయూతనిప్పించడమే తిలక్ లక్ష్యం. అందుకే మనల్ని 'మీరెప్పుడైనా చూసారా ? కన్నీరైనా విడిచారా ' (పిలుపు) అని జాలిగా, సూటిగా ప్రశ్నిస్తాడు. లోకంలోని దైన్యాన్ని కళ్ళకు కట్టించి తోటి మానవుడితోనే కాదు ఆఖరికి దేవుడితో కూడా కన్నీరు కార్పిస్తాడు.

ఇలాంటి దుర్మార్గులను ఎందుకు సృష్టించావని గద్దించడు. దేవుణ్ణి నిలదీయడూ, నిర్బంధించడు. 'కాసంత కన్నీరూ, మరికాస్త సంతోషపు తేనీరూ యిచ్చి నిజాయితీగా హాయి హాయిగా బతక నివ్వ' మంటూ (ప్రార్ధన) జాలిగా వేడుకుంటాడు. ‘దేవుడా రక్షించు నా దేశాన్ని’ అంటూ దీనంగా ప్రార్ధిస్తాడు. తన చేత సృష్టించబడిన మానవుడే దానవుడై పోయాడని కన్నీళ్ళు పెట్టుకున్న దేవుడి కన్నీరు కూడా తుడిచి వీధి చివరిదాకా సాగనంపుతాడు.
‘పెద్దవాడు, కన్న కడుపు. ఏంచేస్తాడు పాపం’(నిన్న రాత్రి) అంటూ భగవంతుణ్ణి కూడా మహోదార హృదయంతో క్షమిస్తాడు. అంతటి కారుణ్య మూర్తిమత్వం తిలక్ ది.

తోటి మానవుణ్ణి హింసించే దానవుడి లాంటి మానవుణ్ణి చూసినా తిలక్ కు ఆవేశం కలగదు. ఆవేదనా, ఆక్రందనా తప్ప. అందుకే నేమో.. ‘చిన్నమ్మా వీళ్ళను కోపగించుకోకు అసహ్యించుకోకు’(నీడలు) అంటాడు. తిలక్ లక్ష్యం దానవుడిగా మారిన మానవుణ్ణి చంపడం కాదు. అతడిలోని దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని నింపడమే తిలక్ ధ్యేయం. '.... పొసగి మేలు చేసి పొమ్మనుటే చాలు' అని వేమన చెప్పినట్టుగా శత్రువును చంపడం కాదు. ఆ శత్రుత్వ గుణాన్ని పోగొట్టడమే ఉత్తమం అనే మార్గాన్ని అవలంబిస్తాడు తిలక్.

దేవుడు మానవుణ్ణిని ఉత్తమ గుణాలతోనే సృష్టించాడు. కానీ ఆ మానవుడు ఏ కారణం వల్లో దానవుడిగా మారితే అది దేవుడి తప్పెలా అవుతుంది. తల్లి తండ్రులు పిల్లలను సదుద్దేశ్యంతోనే కంటారు. సక్రమ మార్గంలోనే నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ తాము కన్న పిల్లలు దుర్మార్గులుగా మారిపోతే  తల్లితండ్రులు మాత్రం ఏం చేయగలరు? ‘నా కన్నబిడ్డ ఇలా మారిపోయాడే’అని నిశ్శబ్దంగా రోదించడం తప్ప. తిలక్ దృష్టిలో దేవుడు కూడా అంతే. అందుకే అతని దేవుడు ఇలాంటి దానవులని చూసి జాలిగా కన్నీళ్ళు కారుస్తాడు.

మానవుడిలోని దానవుడిని తరిమి కొట్టి మానవత్వం నింపడమే తిలక్ కవితా లక్ష్యం. అందుకే అతను అతి గొప్ప మానవతా వాదిగా నిలిచాడు- కవితాభిమానుల మనసులను  గెలిచాడు.
(ఆగష్టు 1,1921 బాలగంగాధర తిలక్ పుట్టినరోజు)

8 comments:

  1. తిలక్ ని గుర్తు చెయ్యడం బాగుంది. ఇప్పటికీ తిలక్ వాక్యాలు వెంటాడతాయి. అనుకోకుండా గుర్తుకు వచ్చి బాధిస్తాయి, సంతోషపెడ్తాయి. మీ వ్యాసం మంచి కవికి మంచి నివాళి.

    www.afsartelugu.blogspot.com

    ReplyDelete
  2. వ్యాస రచయిత్రి నభినందిస్తూ ఆమెతో గళం కలుపుతున్నా----

    అమృతం కురిసిన రాతిరి
    గమనించని జనము నిద్ర క్రమ్మియు నుండన్
    తమిగొనుచు సుధను త్రావిన
    అమరుడు మన కవి తిలక్కు నభినందింతున్---

    ReplyDelete
  3. తిలక్ కవిత్వం గురించి మీరు బాగా రాశారు. అభినందనలు. తిలక్ కవిత.. మధురంగా, ఆర్ద్రంగా పలకరిస్తుంది. ఆహ్లాదపరుస్తుంది.
    నాణేనికి రెండోవైపు కూడా ఉంది. ఆయన కవిత్వ పరిమితులు ఇవీ అంటూ రా.రా. ఓ వ్యాసంలో విశ్లేషించినట్టు గుర్తు.

    ReplyDelete
  4. కవితా సతి నొసట రస గంగాధర తిలకం బాల గంగాధర తిలక్ గురించి చాలా మంచి వ్యాసం అందించారండీ రాధ గారూ. అభినందనలు.
    తిలక్ అనుభూతి వాది. మీదు మిక్కిలి గొప్ప మానవతా వాది.
    కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం కవికే తెలుసు... అని చెబుతూ అర్ధం లేని ఇమేజనరీలతో రాసి, అదే కవిత్వమని దబాయించే అంగుష్ఠమాత్రులని సున్నితంగా మందలించిన కవి.
    ఒక మంచి కవికి మంచి నివాళిగా మీ వ్యాసం అలరించింది. తిలక్ కవితా పంక్తులు మరిన్ని మీ టపాలో కోట్ చేసి ఉంటే బాగుండేది....

    ReplyDelete
  5. తిలక్ గురించి చక్కని వ్యాసం.
    అమృతం కురిసిన రాత్రి ఎవరికీ తెలియకుండా – అమృతాన్ని దోసిళ్ళతో తాగి వచ్చాను,దుఃఖాన్నీ చావునీ వెళ్ళిపొమ్మన్నాను అంటూ సాహితీలోకంలో తన అమరత్వాన్ని స్థిరం చేసుకున్నారు తిలక్. కానీ-
    కొసరు కొంచెమైనా వెయ్యని
    పిసినారి కోమటి దేవుడు
    అసలు తూకంలోనే మోసం చేసి
    ఆనందాన్ని ఆయుఃప్రమాణాన్ని తగ్గిస్తాడు(ప్లస్ ఇంటూ మైనస్).
    దేవుడు తిలక్ విషయంలో కూడా పిసినారిగా వ్యవహరించాడు. అనారోగ్యంతో ఆయుఃప్రమాణం తగ్గి అకాలమరణానికి గురికాకుండా ఉంటే మన తిలక్ తెలుగు సాహితీ మంజూష లో ఎన్ని నిధులు చేర్చేవాడో....
    తిలక్ కవిత్వంలోని మానవతా వాదాన్ని నిరూపిస్తూ చక్కని వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  6. తిలక్ గురించి రాసిన విశ్లేషణ చాల బాగుంది. తిలక్ నిజానికి విప్లవకవి కాడు. అప్పటి ధోరణి బట్టి కొన్ని విప్లవ కవితలు రాసాడు కాని, కరుణ రసం ప్రధానం గా కొంచం శ్రింగారం మేళవించి రాయడమే అతని సహజ ధర్మం. పద్యాలు కూడా కొన్ని రాసాడు. కాని వచన కవిత్వం లో కొత్త అందాలు స్రిష్టించాడు. పత్రికలు కొన్ని ఈ మధ్య తిలక్ గురించి ప్రత్యేక సంచికలు కూడా తెచ్చాయి. అతని కవిత కి నివాళి అర్పిద్దాం.

    ReplyDelete
  7. పొయి లోకి బొగ్గులు లేవు,రాత్రికి రగ్గులు లేవు ఇలాంటి ప్రాస కొరకు పడ్డ ప్రయాసలు వదిలేస్తే తిలక్ కవిత్వం అలరిస్తుంది,ఆలోచింపజేస్తుంది.ముఖ్యంగా పోస్ట్ మాన్ సుబ్బారావు మీద రాసిన కవిత మేలిమి బంగారం.కథల్లోని వాక్యాలు --"నౌకర్లు పనిలేకపోయినా-లేకపోవడం వలననే-మరింత హడావుడిగా అటూఇటూ తిరుగుతున్నారు’లాంటివి,నవ్వించేవీ,కవ్వించేవీ కొల్లలు ఏరుకోగలిగితే.మంచి వ్యాసం అందించినందుకు థన్యవాదాలు,అభినందనలు.

    ReplyDelete
  8. "విలాసవతుల క్రీగంటి చూపుతో
    విద్యుత్ శక్తిని తయారు చేస్తారట
    విశాఖపట్నం కేజీహెచ్ ను
    వేదాటభవనంగా మార్చేస్తారట"
    పై వాక్యాలు చాలవా తిలక్ లోని
    ఆలోచనా శక్తిని చాటటానికి

    ReplyDelete

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails